పని ఇప్పిస్తామంటూ పిలిచి అపహరణ
బెంగళూరులో అప్పు చెల్లించలేదనే కారణంతో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు.
మహిళను అపహరించి వివస్త్రను చేసి దాడి చేశారు. అనంతరం ఆమె నగ్న వీడియోలు తీసి బెదిరించారు.
డబ్బులు చెల్లించకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని హెచ్చరించారు.
తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి
ఈ ఘటనపై బాధితురాలి తల్లి చంద్రా లే అవుట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
బాధితురాలిని రక్షించి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. రేష్మా బాను, నజాత్, రేష్మా భర్త సుహైల్ను నిందితులుగా గుర్తించారు.
రెండేళ్ల క్రితం అప్పు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు సుమారు రెండేళ్ల క్రితం రేష్మా బాను వద్ద రూ. 1 లక్ష అప్పుగా తీసుకుంది. ఆ తర్వాత నజాత్ వద్ద మరో రూ. 50 వేలు అప్పు తీసుకుంది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత ఆరు నెలలుగా వడ్డీ చెల్లించలేదు. రెండు నెలలుగా అసలు వాయిదాలు కూడా కట్టలేదు.
దీంతో రేష్మా ఫోన్ నంబర్ను బాధితురాలు బ్లాక్ చేసి, తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది.
పని ఇప్పిస్తామంటూ పిలిచి..
ఈ క్రమంలో పని ఇప్పిస్తామని చెప్పి నజాత్ బాధితురాలిని పిలిపించాడు.
ఆమె అక్కడికి చేరుకున్న తర్వాత రేష్మా, ఆమె భర్త సుహైల్ ఆమెపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం ఆమెను ఆటోలో బలవంతంగా కుంబల్గోడు సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు.
నగ్న వీడియో తీసి బెదిరింపులు
ఆ ఇంట్లో బాధితురాలిని నిర్బంధించి విచక్షణా రహితంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆమెను వివస్త్రను చేసి వీడియో రికార్డు చేశారు. డబ్బులు చెల్లించకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



