తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదం
తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే), కాంగ్రెస్ మధ్య విభేదాలు బహిరంగమవుతున్నాయి.
ముఖ్యంగా 2029 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరన్న అంశం రెండు పార్టీల మధ్య కొత్త చర్చకు దారితీసింది.
టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్ను ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని పార్టీలోని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అని స్పష్టం చేస్తోంది.
సెప్టెంబర్ 9న మిత్రపక్షాలతో భేటీ
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న టీవీకే మిత్రపక్షాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. టీవీకే మంత్రులు బస్సీ ఆనంద్, ఆర్ఎన్ నిర్మల్ కుమార్, రాజ్ మోహన్ సహా పలువురు నేతలు మిత్రపక్షాలైన ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం నేతలను సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎండీఎంకే అధినేత వైగో కూడా తమ పార్టీ సమావేశానికి హాజరవుతుందని ధృవీకరించారు.
అయితే తమిళనాడులో టీవీకేకు అతిపెద్ద మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్కు ఆహ్వానం అందిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా లేదు. సమావేశం అజెండాను కూడా అధికారికంగా వెల్లడించలేదు.
విజయ్ను ప్రధాని అభ్యర్థిగా చేయాలంటున్న నేతలు
టీవీకేకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నేతలు 2029లో విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
2029లో టీవీకే తరఫున విజయ్ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని కవుండంపాళయం ఎమ్మెల్యే కనిమొళి వ్యాఖ్యానించారు.
ప్రధాని ఎవరు కావాలన్నది ఢిల్లీ కంటే తమిళనాడే నిర్ణయిస్తుందని ఆమె అన్నారు.
రాణిపేట ఎమ్మెల్యే ఐ. తహీరా, మంత్రి ఆర్ఎన్ నిర్మల్ కుమార్ కూడా విజయ్కు జాతీయ స్థాయిలో కీలక పాత్ర ఉండాలని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ అభ్యంతరం.. రాహుల్ గాంధీయే తమ అభ్యర్థి
టీవీకే నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2029లో రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది.
కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత థారహై కుత్బర్ట్ మాట్లాడుతూ.. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడం కొందరు కొత్తగా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యేల అభిమాన ధోరణి ఫలితమేనని అన్నారు.
విజయ్ గతంలో రాహుల్ గాంధీని కూటమి ప్రధాని అభ్యర్థిగా అంగీకరించారని ఆమె గుర్తుచేశారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యాఖ్యలను కూటమి అధికారిక నిర్ణయంగా చూడకూడదని స్పష్టం చేశారు.
తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్ కూడా విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడాన్ని ప్రశ్నించారు.
చివరికి ప్రధాని ఎవరు కావాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
ప్రభుత్వ స్థిరత్వంపైనా చర్చ
విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుపై ఆధారపడి ఉంది. కాంగ్రెస్కు రాష్ట్ర ప్రభుత్వంలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఉన్నారు.
టీవీకేకు సొంతంగా మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్తో విభేదాలు మరింత ముదిరితే ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
మరోవైపు టీవీకే ఇప్పటివరకు అధికారికంగా ఇండియా కూటమిలో చేరలేదు. దీంతో తమిళనాడులో కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం నడుపుతూనే.. జాతీయ స్థాయిలో 2029 ప్రధాని అభ్యర్థిత్వంపై భిన్న వైఖరులు వ్యక్తమవుతున్నాయి.
వామపక్షాలతోనూ టీవీకేకు విభేదాలు
సెప్టెంబర్ 9 సమావేశానికి వామపక్షాలతో టీవీకేకు ఉన్న విభేదాలు కూడా ఒక కారణంగా కనిపిస్తున్నాయి.
సీపీఐ, సీపీఎం నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనకూడదంటూ టీవీకే ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్పై వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుత్వం ఆ సర్క్యులర్ను వెనక్కి తీసుకుంది.
జూలైలో జరిగిన మిత్రపక్షాల తొలి సమావేశానికి వామపక్ష పార్టీలు హాజరు కాలేదు.
కూటమి భవిష్యత్పై కీలక నిర్ణయాలు?
సెప్టెంబర్ 9న జరిగే సమావేశంలో కూటమికి స్టీరింగ్ కమిటీ, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, కూటమి పేరు, కన్వీనర్ నియామకం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదే సమయంలో ‘విజయ్ ఫర్ పీఎం’ అంటూ టీవీకేలో జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి విజయ్ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. 2029లో ప్రధాని పదవిపై ఆయనకు నిజంగా ఆసక్తి ఉందా? ఉంటే 2029 ఎన్నికలే లక్ష్యమా? లేక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమా? అనే అంశాలపై కూడా స్పష్టత లేదు.
ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా టీవీకే మంత్రి వెంకటరామన్ స్పందించారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా చేయాలంటూ కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలేనని ఆయన పేర్కొన్నారు.



