శిథిలాల్లోకి సులువుగా ప్రవేశించే సైబోర్గ్ బొద్దింకలు
భూకంపాలు, భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాల సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటం రెస్క్యూ బృందాలకు పెద్ద సవాల్.
మనుషులు లేదా పెద్ద రోబోలు వెళ్లలేని అత్యంత ఇరుకైన ప్రదేశాల్లోకి వెళ్లేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అదే సైబోర్గ్ బొద్దింకలు.
ఈ టెక్నాలజీలో ప్రాణమున్న బొద్దింక వీపుపై అతి చిన్న ఎలక్ట్రానిక్ బ్యాక్ప్యాక్ను అమర్చుతారు.
దీనికి అనుసంధానించిన సన్నని ఎలక్ట్రోడ్లను బొద్దింక స్పర్శ శృంగాలు, శరీర వెనుక భాగాలకు కలుపుతారు.
ఈ ఎలక్ట్రోడ్లకు సిగ్నల్స్ పంపడం ద్వారా బొద్దింక ఏ దిశలో కదలాలో శాస్త్రవేత్తలు లేదా పారామెడికల్ సిబ్బంది రిమోట్గా నియంత్రించగలరు.
సోలార్ సెల్స్తో నిరంతరం పని.. బాధితులను గుర్తించే సెన్సార్లు
సైబోర్గ్ బొద్దింకల బ్యాక్ప్యాక్లకు ఫ్లెక్సిబుల్ సోలార్ సెల్స్ను అమర్చుతారు.
వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో బొద్దింక శరీరంపై ఎక్కువ బరువు పడకుండా పరికరాలు పనిచేస్తాయి.
పెద్ద ప్రమాదాల తర్వాత కూలిపోయిన కాంక్రీట్ శిథిలాల మధ్య చిన్న చిన్న ఖాళీలు మాత్రమే ఉంటాయి.
ఇలాంటి ప్రదేశాల్లో సైబోర్గ్ బొద్దింకలు సులువుగా కదలగలవు.
పరికరాల్లోని మైక్రో సెన్సార్లు, కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా శిథిలాల కింద మనుషుల ఉనికిని, శరీర వేడిని గుర్తించవచ్చు.
అంతేకాదు.. అక్కడ ఆక్సిజన్ స్థాయి ఎలా ఉంది? చుట్టుపక్కల వాతావరణం సురక్షితంగా ఉందా? వంటి సమాచారాన్ని బయట ఉన్న రెస్క్యూ బృందాలకు వెంటనే పంపించవచ్చు.
రోబోలతో పోలిస్తే తక్కువ శక్తి వినియోగం
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, సాంప్రదాయ రోబోలతో పోలిస్తే ప్రాణమున్న బొద్దింకలను ఉపయోగించడం వల్ల తక్కువ శక్తి ఖర్చవుతుంది.
అత్యంత కఠినమైన, ఇరుకైన ప్రాంతాల్లోనూ ఇవి సులువుగా కదలగలవు.
భవిష్యత్తులో భూకంపాలు, భవనాలు కూలిపోవడం వంటి విపత్తుల సమయంలో సైబోర్గ్ బొద్దింకలు రెస్క్యూ ఆపరేషన్లలో కీలకంగా మారే అవకాశం ఉంది.
శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను వేగంగా గుర్తించడంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.



