బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం
కడప జిల్లాలో ఆర్టీసీ బస్సులో యాసిడ్ క్యాన్ పగిలిన ఘటన కలకలం రేపింది.
కమలాపురం మండలం టీ చదివిరాళ్ల గ్రామం సమీపంలో బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది.
బస్సులో తీసుకువెళ్తున్న యాసిడ్ క్యాన్ పగిలిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
యాసిడ్ బయటకు రావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు కళ్లలో మంటలు వచ్చాయి.
పరిస్థితిని గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే డ్రైవర్ను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ బస్సును పక్కకు ఆపారు.
ప్రయాణికులంతా వెంటనే బస్సు నుంచి కిందకు దిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అనంతపురం నుంచి కడపకు తరలిస్తుండగా ఘటన
అనంతపురంకు చెందిన ఓ కార్గో కంపెనీ యాసిడ్ను కడప డిపోకు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
కమలాపురం నుంచి టీ చదివిరాళ్ల మండలం మీదుగా బస్సు వెళ్తుండగా యాసిడ్ క్యాన్ పగిలింది.
యాసిడ్ మరింతగా లీక్ అయి ప్రయాణికులపై పడినా.. లేదా పేలినా పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును వెంటనే ఆపడం, ప్రయాణికులు కిందకు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రయాణికుల బస్సుల్లో ప్రమాదకర పదార్థాల రవాణాపై ప్రశ్నలు
ప్రయాణికులు ప్రయాణించే బస్సుల్లో యాసిడ్ వంటి ప్రమాదకర పదార్థాలను తరలించడం భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఇలాంటి పదార్థాలను రవాణా చేసే సమయంలో తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రమాదకర రసాయనాలను ప్రత్యేక వాహనాల్లో సురక్షితంగా తరలించాల్సి ఉండగా.. ప్రయాణికులతో కూడిన బస్సులో తరలించడం వల్ల ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఘటన నేపథ్యంలో రవాణా భద్రతా నిబంధనలపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.



