హైదరాబాద్: తెలంగాణలో ఇకపై ట్రాఫిక్ చలాన్లు వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా పంపినా అధికారికంగా అందినట్టే పరిగణిస్తారు. ఇందుకోసం వాహన యజమానులు 30 రోజుల్లోగా వాహన్ పోర్టల్లో తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు నవీకరించాలి.
గడువు ముగిసిన తర్వాత వాహన్ డేటాబేస్లో నమోదైన నంబర్ లేదా ఈమెయిల్కు పంపిన చలాన్ అందినట్టే భావిస్తారు. “మెసేజ్ రాలేదు”, “చలాన్ గురించి తెలియదు” అనే కారణాలను ఇక చూపలేరు.
పెండింగ్ చలాన్ల వసూళ్లు పెంచడం, నోటీసులు నేరుగా వాహన యజమానులకు చేరేలా చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని అధికారులు తెలిపారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనల కింద ప్రభుత్వం ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈమెయిల్ను చలాన్ల పంపిణీకి చెల్లుబాటు అయ్యే ఎలక్ట్రానిక్ మార్గాలుగా గుర్తించింది.

