మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం (ఫిబ్రవరి 7, 2026) భారీ కాన్వాయ్తో గుంటూరుకు బయలుదేరారు. అంబటి కుటుంబానికి సంఘీభావం తెలపడమే లక్ష్యంగా ఈ ‘చలో గుంటూరు’ కార్యక్రమాన్ని చేపట్టారు.
మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు ఈ బృందంలో ఉన్నారు. గుంటూరు వెళ్లే మార్గంలో పాయకరావుపేటలో ఆగని నేతలు, అక్కడ చిన్నపాటి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
అక్రమ అరెస్టులతో భయాందోళన సృష్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ప్రభుత్వం చూస్తోందని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు ఇలాంటి దాడులకు భయపడబోరని స్పష్టం చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని, ఆయన అరెస్టును తప్పుబడుతూ.. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని నేతలు ప్రకటించారు.రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, విశాఖ నేతల రాకతో గుంటూరులో రాజకీయ సెగ మరింత పెరిగింది.
