ఖర్చుల భారం.. కస్టమర్ల దూరం
హైదరాబాద్: హైదరాబాద్లో హోటల్ పరిశ్రమ కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు కస్టమర్లతో కిటకిటలాడిన అనేక హోటళ్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా కుటుంబాలతో బయట భోజనం చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల భారం, పొదుపు ధోరణి కారణంగా చాలా మంది బయట తినడాన్ని తగ్గించుకున్నారని అంటున్నారు.
నలుగురు సభ్యుల కుటుంబం ఒక సాధారణ రెస్టారెంట్కు వెళ్లినా కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు బిల్లు అవుతోంది. కొన్ని ప్రముఖ హోటళ్లలో ఈ ఖర్చు ఇంకా ఎక్కువగా ఉంటోంది.
వెజ్, నాన్వెజ్ వంటకాల ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు హోటళ్లకు వెళ్లడంపై వెనుకంజ వేస్తున్నాయి.
గతంలో వారాంతాలు, సెలవు రోజుల్లో హోటళ్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు చాలా చోట్ల నేరుగా వెళ్లి టేబుల్ దొరికే పరిస్థితి కనిపిస్తోంది.
ఇది కస్టమర్ల సంఖ్య ఎంత మేర తగ్గిందో చూపిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఆన్లైన్ ఆర్డర్లకూ దెబ్బ
హోటళ్లలో భోజనం చేసే వారి సంఖ్య తగ్గడమే కాకుండా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఆర్డర్లపైనా ప్రభావం పడినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆదివారాల్లో భారీగా వచ్చే స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు కూడా తగ్గాయని రెస్టారెంట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. వారాంతాల్లో కూడా ఆశించిన స్థాయిలో వ్యాపారం లేకపోవడం హోటల్ రంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
హైదరాబాద్ అంటే బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులు నగరానికి వచ్చినప్పుడు బిర్యానీ రుచి చూడడం ఆనవాయితీగా మారింది.
ప్రతి రోజు లక్షలాది మంది నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇటీవల పర్యాటకుల రాక కూడా కొంత మేర తగ్గిందని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో బిర్యానీ విక్రయాలపైనా ప్రభావం కనిపిస్తోందని అంటున్నారు.
పెరిగిన ముడిసరుకు ధరలు
హోటల్ రంగం ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య నిర్వహణ ఖర్చుల పెరుగుదల. ఇటీవల వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటళ్లపై అదనపు భారం పడింది.
అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు కూడా ఇంధన వ్యయాలను ప్రభావితం చేస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
అంతేకాకుండా కూరగాయలు, నూనెలు, బియ్యం, మసాలా దినుసులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. కొన్ని కూరగాయల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఈ పరిస్థితుల్లో హోటళ్లు వంటకాల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.
లాభాలు కాదు.. ఖర్చులే భారంగా
ధరలు పెంచితే కస్టమర్లు తగ్గుతున్నారు. ధరలు పెంచకపోతే నిర్వహణ ఖర్చులు భరించడం కష్టమవుతోంది.
ఈ రెండు సమస్యల మధ్య అనేక చిన్న, మధ్య తరహా హోటళ్లు ఇబ్బందులు పడుతున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో రోజువారీ ఖర్చులు కూడా రాకపోవడంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హోటల్ రంగం నగర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తుంది.
ప్రస్తుతం కొనసాగుతున్న మందగమనం మరికొంత కాలం కొనసాగితే చిన్న హోటళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వ్యాపారం మళ్లీ పుంజుకోవాలంటే వినియోగదారుల ఖర్చు సామర్థ్యం పెరగడం, ముడిసరుకు ధరలు స్థిరపడడం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.
Also Read



