మూడు నెలల ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికకు సూచనలు
హైదరాబాద్: గచ్చిబౌలి పరిధిలో కీలకమైన ఐఐఐటీ జంక్షన్–డీఎల్ఎఫ్ కారిడార్ రహదారి అభివృద్ధి పనులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం, రహదారి విస్తరణ పనుల పురోగతిని ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి డీఎల్ఎఫ్ జంక్షన్ వరకు చేపడుతున్న అభివృద్ధి పనులు నగర ట్రాఫిక్ పరిస్థితులపై కీలక ప్రభావం చూపనున్న నేపథ్యంలో సీపీ స్వయంగా నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. పనుల ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సవాళ్లు, ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
Alsu Read
గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
శేర్లింగంపల్లి ఏడీసీపీ హనుమంతరావు, సిఎంసి అధికారులతో కలిసి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన సీపీ, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆలస్యం లేకుండా నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పనుల సమయంలో ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడం కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని సూచించారు.
వాహనాల రాకపోకలకు ఆటంకం తక్కువగా ఉండేలా సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతున్నందున రాబోయే మూడు నెలల పాటు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ అమలు చేయాలని సీపీ ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ట్రాఫిక్ సిబ్బందిని అదనంగా మోహరించాలని చెప్పారు.
ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకుంటే ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
వాహనదారులకు సూచనలు
నిర్మాణ పనుల కాలంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సీపీ కోరారు. రద్దీ ప్రాంతాలను వీలైనంత వరకు నివారించాలని సూచించారు.
ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించడం వల్ల సమయం ఆదా అవుతుందని చెప్పారు.
ట్రాఫిక్ మళ్లింపులపై పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుందని తెలిపారు. ప్రజలు అధికారిక ప్రకటనలను గమనించాలని సూచించారు.
పూర్తయితే రద్దీకి చెక్
ఐఐఐటీ జంక్షన్–డీఎల్ఎఫ్ కారిడార్లో జరుగుతున్న ఫ్లైఓవర్, రహదారి విస్తరణ పనులు పూర్తయిన తర్వాత గచ్చిబౌలి–డీఎల్ఎఫ్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని సీపీ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఎక్కువగా వినియోగిస్తున్న ఈ మార్గంలో వాహనాల రాకపోకలు మరింత సులభమవుతాయని చెప్పారు.
ప్రయాణ సమయం తగ్గడంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్హెచ్ఓ సురేష్, సిఎంసి అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read

