నగరంలోని భీమ్ నగర్ ప్రాంతంలో ఓ వివాహితపై భర్త కిరాతకంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. శ్రీవాణి అనే మహిళను ఆమె భర్త కొల్లి రామనాయుడు తీవ్రంగా హింసించి గాయపరిచినట్లు సమాచారం.
గాయాలపాలైన బాధితురాలిని కుటుంబ సభ్యులు వెంటనే కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)కు తరలించగా, ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లే అనురాధ, విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ కమిషనర్ను కలిసి ఘటనపై ఫిర్యాదు చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
